న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం రెండేండ్ల కిందట ప్రారంభించిన ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ అకాడమీని మూసివేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి దశలవారీగా ఈ సేవలను నిలిపివేయనున్నట్టు గురువారం వెల్లడించింది.
ఈ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులకు జేఈఈ సహా పలు పోటీపరీక్షలకు కోచింగ్ అందిస్తున్నది. అయితే దీని మూసివేతకు కారణాలు వెల్లడించలేదు. సబ్స్ర్కైబర్లకు ఇబ్బందులు తలెత్తకుండా 2024 అక్టోబర్ వరకు ఫుల్కోర్సు మెటీరియల్ను అందుబాటులో ఉంచనున్నట్టు అమెజాన్ తెలిపింది. ప్రస్తుత అకడమిక్ బ్యాచ్ వారికి మాత్రం పూర్తి ఫీజును రిఫండ్ చేయనున్నట్టు వెల్లడించింది. లాక్డౌన్ అనంతరం స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు తిరిగి ప్రారంభం కావడంతో ఎడ్యుటెక్ సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు బైజూస్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇతర సంస్థలు అన్అకాడమీ, వైట్హ్యాట్ జూనియర్, టాపర్, వేదాంతు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు పేర్కొన్నాయి. దేశంలో ఆర్థిక మందగమనానికి ఇది సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.