Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా బాబా బార్ఫానీని దర్శించుకున్నారు. మరో వైపు జమ్మూ నుంచి 7వేల మంది యాత్రికుల బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ గుహకు బయలుదేరింది.
కొద్ది రోజుల నుంచి భగవతి నగర్ బేస్ క్యాంపుకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య పెరిగింది. కొన్ని బ్యాచ్లలో ప్రతిరోజూ 7వేల నుంచి 9వేల మంది యాత్రికులు బేస్ క్యాంప్ జమ్మూ నుంచి దర్శనానికి వెళ్తున్నారు. సరస్వతి ధామ్ రైల్వేస్టేషన్లో టోకెన్ల జారీతో పాటు వైష్ణవి ధామ్ రైల్వే స్టేషన్, పంచాయతీ భవన్ రైల్వే స్టేషన్లో తక్షణ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రామ మందిరం పురాణి మండి, గీతా భవన్ పరేడ్లో సాధువుల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది.
మరో వైపు అమర్నాథ్ యాత్రపై రైల్వే డీజీపీ సునీల్కుమార్ సమీక్షించారు. ట్రాక్లపై పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. పలు రైళ్లను రద్దు చేయడంతో జమ్మూ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. రైలు సేవలు పూర్తిగా పని చేసేవరకు చాలా మంది తాత్కాలికంగా జమ్మూలో ఉండేందుకు ఇష్టపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణికులతో సానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ను కూడా సందర్శించారు.