చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సొంతగా రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని, ఎన్నికల కమిషన్ నుంచి గ్రీన్సిగ్నల్ లభించగానే పార్టీ పేరు, ఎన్నికల గుర్తును నిర్ధారిస్తానని బుధవారం వెల్లడించారు. కొత్త పార్టీ పేరుపై ఇంకా స్పష్టత రాలేదని, ఎన్నికల గుర్తుపై ఈసీ నుంచి సమాచారం రావాల్సి ఉందని చెప్పారు.
దీనిపై తమ న్యాయవాదులు కసరత్తు సాగిస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రకటన తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దసంఖ్యలో నేతలు తమ పార్టీలో చేరతారని చెప్పారు. నవజోత్ సింగ్ సిద్ధూ ఎక్కడ పోటీ చేసినా తాము దీటుగా నిలువరిస్తామని అన్నారు. సిద్ధూ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పార్టీ ప్రతిష్ట 25 శాతం దిగజారిందని సర్వేలు వెల్లడించాయని తెలిపారు. బీజేపీతో కూటమి ఉండదని, అయితే ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు తాను సిద్ధమని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.