న్యూఢిల్లీ : పంజాబ్ సీఎంగా తనను తొలగించడం పట్ల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై పీఎల్సీ చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. తనను ఎందుకు తొలగించారనేందుకు వారు ముందుగా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా వెళుతున్నాననే భయంతోనే కాంగ్రెస్ అగ్రనేతలు తనపై దాడిని తీవ్రతరం చేశారని కెప్టెన్ సింగ్ చెప్పుకొచ్చారు. పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించినందునే అమరీందర్ సింగ్ను పంజాబ్ సీఎంగా తప్పించామని రాహుల్ గాంధీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర సర్కార్ను నడిపించారని కూడా రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా గాంధీ సోదరుల వ్యాఖ్యలను కెప్టెన్ సింగ్ తోసిపుచ్చారు. కేంద్ర మంత్రులతో సమావేశం కాకుండా ఓ రాష్ట్ర సీఎం ఎలా పనిచేస్తారని వారిని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులను కలవడం వారికి కంటగింపుగా మారిందని అన్నారు. ఇక యూపీ, బిహార్ నేతలను పంజాబీలు అనుమతించరాదని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యపై కెప్టెన్ సింగ్ స్పందిస్తూ ఇది అనాలోచిన ప్రకటన అని ఆక్షేపించారు. ఏ ప్రాంతానికి చెందిన వారనే విషయంతో సంబంధం లేకుండా భారత్ భారతీయులందరిదీనని అన్నారు. ఏ ఒక్కరికీ మనం తలుపులు మూసివేయమని, ఇక ముందు కూడా అలా జరగదని, ఇలాంటి మాటలు మాట్లాడటానికి చన్నీ ఎవరని కెప్టెన్ సింగ్ నిలదీశారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎస్ఏడీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల నేతలు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పు తీసుకురావాలనుకుంటే తనను ఉద్దేశించి ఈ వ్యక్తికి ఓటు వేయండని అభ్యర్ధించారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్బీర్ సింగ్ బాదల్లు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని, వారివైపు మొగ్గితే తిరోగమనమేనని హెచ్చరించారు. సిద్ధూ అమృత్సర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు అమృత్సర్ ఈస్ట్లో సిద్ధూకు అనుకూలంగా పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో సిద్ధూపై ఎస్ఏడీ అభ్యర్ధిగా విక్రం సింగ్ మజితియాను బరిలో నిలిపింది. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ హైకమాండ్ చన్నీకి సీఎం అభ్యర్ధిత్వం కట్టబెట్టింది. ప్రజాభిప్రాయం చన్నీకి అనుకూలంగా రావడంతో పాటు పంజాబ్లో దళిత జనాభా 30 శాతం దాటడంతో దళితులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దళిత నేత చన్నీవైపు మొగ్గుచూపింది.
సీఎం అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కినుక వహించారు. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పాలక కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో గట్టెక్కాలని ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ-పీఎల్సీ కూటమి, ఎస్ఏడీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.