చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమ కూటమి ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు.
బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో భాగంగా కెప్టెన్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల సర్ధుబాటును చేపడతాయని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 శాతం తాము విజయం సాధిస్తామని కెప్టెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
ఏడు దశల చర్చల అనంతరం బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని తాను ప్రకటిస్తున్నానని పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ షెకావత్ వెల్లడించారు. సీట్ల సర్ధుబాటు వంటి అంశాలపై తర్వాత చర్చలు జరుపుతామని తెలిపారు.