Punjab polls : దేశ ప్రధాని కాన్వాయ్కు అడ్డంకులు తొలగించడంలో విఫలమైన పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర హోం మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ప్రధాని కాన్వాయ్ను సజావుగా సాగనంపడం చేతకాని సీఎం, హోం మంత్రులకు పదవుల్లో కొనసాగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రహదారిపై ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడం పట్ల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పంజాబ్ సర్కార్పై మండిపడ్డారు. ప్రధాని వెళ్లే మార్గం క్లియర్ చేశామని ఎస్పీజీకి హామీ ఇచ్చిన పంజాబ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మరోవైపు అదే మార్గంలో నిరసనకారులను అనుమతించడం ఘోర భద్రతా వైఫల్యమని అన్నారు.
నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చిది. ప్రధాని ర్యాలీకి పదివేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారని, అయితే ప్రధాని షెడ్యూల్ లోని రోడ్డు మార్గం ద్వారా హుస్సేనీవాలా చేరుకునేందుకు పూనుకున్నారని అందుకే ఇబ్బందులు తలెత్తాయని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ట్వీట్ చేశారు.
ప్రధాని సభకు జనం కరువైనందునే ర్యాలీని రద్దుచేసుకున్నారని సుర్జీవాలా ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ముందు రైతుల బాధలు వినండి..ఆపై ర్యాలీలు నిర్వహించుకోండని సుర్జీవాలా కాషాయ పార్టీకి చురకలు వేశారు.