న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతికి స్వస్తిపలికిన మరుసటి రోజే బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. బీటింగ్ రిట్రీట్ వేడుకలో చివరన ఆలపించే ‘అబైడ్ విత్ మీ’ అనే మిలిటరీ గీతాన్ని రద్దుచేసింది. దాని స్థానంలో ప్రసిద్ధ దేశ భక్తి గేయం ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాట ట్యూన్ను చేర్చింది. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన అబైడ్ విత్ మీ గీతానికి సైనిక ఉత్సవాల్లో ప్రాముఖ్యం ఉన్నది. స్కాటిష్ రచయిత హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో ఈ గీతాన్ని రాశారు. 1950 నుంచి ప్రతి గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత జనవరి 29న ఇండియా గేట్ వద్ద నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుకల ముగింపు సందర్భంగా ఈ గీతా న్ని ఆలపిస్తున్నారు. అయితే, ఈ గీతం వలసపాలనకు గుర్తుగా ఉన్నదని భావించిన మోదీ ప్రభు త్వం 2020లోనే దీన్ని తొలగించాలని భావించింది. అయితే విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది.