న్యూఢిల్లీ : తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీలోని ముజఫర్నగర్, ఘజియాబాద్, సీతాపూర్, లఖింపూర్, హత్రాస్లలో జుబేర్పై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తనపై పెండింగ్లో ఉన్న కేసులను విచారించేందుకు యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (Sit) ఏర్పాటు చేయడాన్ని సైతం జుబేర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రీత్ ఇందర్ సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. 2018లో సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్లు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై జూన్ 27న ఢిల్లీ పోలీసులు జుబేర్ను అరెస్ట్ చేశారు. మనోభావాలను దెబ్బతీశారంటూ సీతాపూర్లో నమోదైన కేసులో ఆయన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు గతంలో పొడిగించింది. ఇతర కేసుల్లో ఎలాంటి ఊరట కల్పించకపోవడంతో జుబైర్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.