న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ప్రముఖ ఎన్జీవో సంస్థ ఆక్స్ఫామ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఎఫ్సీఆర్ఏ కింద రిజిస్టర్ అయినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఆక్స్ఫామ్ ఇండియా విదేశీ విరాళాలను ఇతర సంస్థలకు బదిలీ చేసిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇలాంటి బదిలీలను ఎఫ్సీఆర్ఏ నిషేధించిందని చెప్పాయి. తాజా పరిణామంపై ఆక్స్ఫామ్ ఇండియా తక్షణమే స్పందించలేదు.
గత ఏడాది ఈ సంస్థలో ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సర్వేలో పలు ఈ-మెయిల్స్ను గుర్తించారని, ఇతర ఎఫ్సీఆర్ఏ రిజిస్టర్డ్ సంఘాలకు, లాభాపేక్ష సంస్థలకు నిధులను మళ్లించడం ద్వారా ఎఫ్సీఆర్ఏ నిబంధనలను తప్పించునేందుకు ప్రణాళిక రచించినట్టు అందులో ఆధారాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. కమీషన్ రూపంలో తమ ఉద్యోగుల ద్వారా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మేథోసంస్థ సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్(సీపీఆర్)కు ఆక్స్ఫామ్ ఇండియా నిధులు మళ్లించినట్టు చెప్పారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించారు. ఆక్స్ఫామ్ ఇండియా లైసెన్స్ను కేంద్రం గత ఏడాది జనవరిలో రద్దు చేసింది.