న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటు రాజకీయ నేతలు, అటు హక్కుల సంఘం నేతలను అనేక రకాలుగా వేధిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులను సైతం టార్గెట్ చేసుకొని వారు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, వారిలో వివేచనా శక్తి లేకుండా చేసేందుకు తీవ్రంగా తన ప్రయత్నం చేస్తున్నది. ఆ క్రమంలోనే పాఠ్యపుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన అంశాలను తొలగించి విమర్శలను ఎదుర్కొంటున్నది.
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య తదితర పాఠాలను ఎన్సీఈఆర్టీ నుంచి తొలగించి ఇప్పటికే విమర్శలను మూటకట్టుకున్నది. ఇప్పుడు జీవశాస్త్ర సంబంధ పరిణామవాదం లాంటి పాఠాలను సైతం తొలగించి విద్యార్థుల్లో హేతుబద్ధతను, వివేచనా శక్తిని సైతం నిర్వీర్యం చేసేలా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తన శక్తిమేరకు కృషి చేస్తున్నది.
సీబీఎస్ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం నూతన పాఠ్య ప్రణాళికలో భాగంగా పదో తరగతి పుస్తకాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం పాఠాన్ని తొలగించింది. ఎన్సీఈఆర్టీ చర్యపై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన 1,800 మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగించిన పాఠాలను వెంటనే పునరుద్ధరించాలంటూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.