లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లోని యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజులు ఏకంగా 400 శాతం పెరిగాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు గత పది రోజులుగా నిరసన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ, వర్సిటీ యంత్రాంగం కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలహాబాద్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న పలు కోర్సుల ఫీజులను 400 శాతం మేర పెంచారు. ఆగస్ట్ 31న ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి ఆమోదించింది. దీంతో పలు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు గత పది రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు గత ఏడు రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఆరోగ్యం క్షీణించిన ఐదుగురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
కాగా, విద్యార్థులు తమ నిరసనను తీవ్రం చేసినప్పటికీ యూపీలోని బీజేపీ ప్రభుత్వం కానీ, యూనివర్సిటీ యంత్రాంగం కానీ స్పందించలేదు. దీంతో సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద జరిగిన భారీ నిరసనలో ఒక విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన యూనివర్సిటీ క్యాంపస్లో కలకలం రేపింది.
మరోవైపు అలహాబాద్ యూనివర్సిటీలో భారీగా ఫీజుల పెంపుపై నిరసన చేస్తున్న విద్యార్థులకు ఆ రాష్ట్రంలోని విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఇది మరో ఉదాహరణ అని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. సీఎం యోగి పాలనలో యువత నిస్సహాయ స్థితిలో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. భారీగా పెంచిన ఫీజులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.