లక్నో, జనవరి 18: తల్లిదండ్రుల నుంచి మనోవర్తి (మెయింటెనెన్స్) కోరే హక్కు పెండ్లి కాని కూతురికి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయస్సు, మతంతో సంబం ధం లేకుండా గృహహింస చట్టం ప్రకారం ఇది వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. తండ్రి, పిన తల్లి తమ బాగోగులు చూసుకోవటం లేదని ముగ్గురు కూతుర్లు కోర్టును ఆశ్రయించగా, వారికి మనోవర్తి చెల్లించాలంటూ ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు ఓ కేసులో తీర్పు వెలువరించింది.
దీనిని సవాల్ చేస్తూ నయీముల్లా ఖాన్, మరికొంత మంది అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్ను తిరస్కరిస్తూ హైకోర్టు ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. కూతుర్లు ఆర్థికంగా స్వతంత్రులంటూ పిటిషన్దారులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ‘ఇక్కడ హిందూ, ముస్లిం, వయస్సులతో సంబంధం లేదు. తన తల్లిదండ్రుల నుంచి మనోవర్తిని కోరే హక్కు పెండ్లికాని కూతురికి ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు’ అని జస్టిస్ జ్యోత్స్న శర్మ వ్యాఖ్యానించారు.