న్యూఢిల్లీ: స్కూల్లో హిజాబ్(Hijab) ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్లోని ఓ ముస్లిం బాలిక పెట్టుకున్న అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. స్కూల్ యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని ఆ విద్యార్థిని పిటీషన్లో కోరింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ పిల్ను కొట్టివేసింది. అది ఆవశ్యకమైన మత విధానం కాదు అని కోర్టు తెలిపింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇంద్రజీత్ శుక్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆగస్టు 21వ తేదీన తీర్పును వెలువరించింది. ఇస్లామిక్ మత విశ్వాసాల్లో మహిళలు తలకు హిజాబ్ను ధరించడాన్ని ఆవశ్యకమైందిగా పరిగణించడం లేదని ధర్మాసనం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పిటీషన్ దాఖలు చేసిన అమ్మాయి హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది. అయితే అదే స్కూల్లో ఆమె ఇప్పుడు 11వ తరగతిలోకి ప్రవేశిస్తోంది. ఆరో తరగతి నుంచి తన స్కూల్ యూనిఫాంపై హిజాబ్ను ధరిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆ సమయంలో ఎవరూ అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదన్నారు. తన వాదనలకు మద్దతుగా ఆమె ఐడీ కార్డులను ప్రజెంట్ చేసింది. క్లాస్ 8,9,10 తరగతుల్లో దిగిన ఫోటోలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టింది. కానీ 11వ తరగతిలో ప్రవేశం వేళ స్కూల్ మేనేజ్మెంట్ హిబాజ్ను వ్యతిరేకించినట్లు చెప్పింది. హిజాబ్ ధరించడం అంటే డ్రెస్సు కోడ్ను ఉల్లంఘించడమే అవుతుందని, దీని వల్లే అడ్మిషన్ తిరస్కరించినట్లు పేర్కొన్నది.
స్కూళ్లలో హిజాబ్ ధారణ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదని, గతంలో కర్నాటక హైకోర్టు స్కూళ్లలో హిజాబ్ను అనుమతించలేదని కూడా అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. హెడ్స్కార్ఫ్ను ధరించడం ముఖ్యమైన మత విధానం అని విద్యార్థిని తన పిటీషన్లో వాదించారు. అయితే దీన్ని హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో మతపరమైన గ్రంధాలు కానీ, అధికారిక ఆధారాలు ఏవీ లేవని కోర్టు చెప్పింది. ప్రయాగ్రాజ్లోని అత్తర్సుయాలో ఉన్న ఠాగూర్ పబ్లిక్ స్కూల్కి చెందిన విద్యార్థిని పిటీషన్ వేసింది. చిన్ననాటి నుంచి హిజాబ్ ధరించినా.. స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని ఆ విద్యార్థి హక్కుగా భావించలేమని, దీని కోసం స్కూల్ యూనిఫాం పాలసీని మార్చలేమని, 11వ తరగతిలోకి ప్రవేశిస్తున్న ఆ విద్యార్థి కోసం నిబంధనలను సడలించలేరని ధర్మాసనం తెలిపింది.