లక్నో, సెప్టెంబర్ 1: మొబైల్ ఫోన్ ద్వారా జరిపిన రికార్డెడ్ సంభాషణలు సాక్ష్యంగా అనుమతించదగినవేనని, ఆ సంభాషణలు అక్రమంగా రికార్డు చేసినప్పటికీ వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చునని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి స్పష్టం చేసింది. లంచం కేసులో తనకు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనను ట్రయల్ కోర్టు నిరాకంరిచడాన్ని సవాల్ చేస్తూ ఫతేగర్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సీఈవో మహంత్ ప్రసాద్ రామ్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు.
తనపై దాఖలు చేసిన కేసులో సెల్ఫోన్లో అక్రమంగా రికార్డు చేసిన సంభాషణల ఆధారంగా విచారణ జరిగిందని, అయితే సెల్ఫోన్ రికార్డెడ్ సంభాషణలు సాక్ష్యంగా పనికిరానందున తనపై కేసు కొట్టివేయాలని కోరాడు. అయితే దానిని తిరస్కరించిన జస్టిస్ సుభాష్ విద్యార్థి ఫోన్ రికార్డెడ్ సంభాషణ సాక్ష్యంగా పనికివస్తుందని, ఒక సాక్ష్యాన్ని అక్రమంగా సంపాదించినంత మాత్రాన దానిని తిరస్కరించరాదని చట్టం చెబుతున్నదని పేర్కొంటూ ఆయన పిటిషన్ను కొట్టివేశారు.