అలహాబాద్, జూలై 15 : దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం భర్త ఆదాయంలో గరిష్ఠంగా 25 శాతం వరకు భార్యకు భరణంగా ఇవ్వాలని నిర్ణయించడం కేవలం మార్గదర్శకం మాత్రమేనని, దానిని తప్పనిసరి నిబంధనగా పరిగణించరాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతి కేసులోను వాస్తవాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 25 శాతం కన్నా ఎక్కువగా లేదా తక్కువగా కూడా భరణాన్ని నిర్ణయించే విచక్షణ అధికారం కింది కోర్టులకు ఉంటుందని తెలిపింది.
పన్నులు, ఇతర మినహాయింపుల అనంతరం భర్త చేతికి అందే నికర ఆదాయం ఆధారంగా భరణాన్ని లెక్కించాలని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న దంపతులు పింకీ, జైప్రకాశ్లు వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భరణాన్ని రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ తీర్పు చెప్పింది.