న్యూఢిల్లీ: అధికారుల జీతం నుంచే పరిహారం రికవరీ చేయాలని అలహబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన న్యాయ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరి(24)ని జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆమెను నిర్బంధించాలని ఆదేశించిన నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. నోయిడా డీఎంతో పాటు మొత్తం పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్దేవ్లతో కూడిన ధర్మాసనం గత వారం ఈ కేసును విచారించింది.
ఆకృతి చౌదరి నిర్బంధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆమెకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించిందని పేర్కొంది. నిర్బంధ ఉత్తర్వులు, అందుకు పేర్కొన్న కారణాలు ఎటువంటి ఆధారాలు లేనివిగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఆకృతి చౌదరికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని జిల్లా మెజిస్ట్రేట్తో పాటు బాధ్యులైన ఇతర అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని, చివరకు సంబంధిత ఎస్హెచ్వో వరకు బాధ్యత వహించే అధికారుల జీతాల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది.