న్యూఢిల్లీ: మూడేండ్లలో జరిగే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోపాటు గాంధీల త్రయంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చించారని సమాచారం. రాహుల్ గాంధీ నివాసంలో తొలుత ఆయనతోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ వధ్రాలతో మాత్రమే ప్రశాంత్ కిశోర్ మంగళవారం సమావేశమైనట్లు వార్తలొచ్చాయి.
కానీ ఈ చర్చల్లో సోనియాగాంధీ కూడా భాగస్వామి అయ్యారని విశ్వసనీయ సమాచారం. అదీ వర్చువల్ లింక్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారని వినికిడి.
గాంధీల త్రయంతో ప్రశాంత్ కిశోర్ చర్చలు కేవలం పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం కాలేదని కాంగ్రెస్ పార్టీ సన్నిహిత వర్గాల కథనం. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల కంటే పెద్ద విషయాలే చర్చకు వచ్చాయని వినికిడి.
అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోరాటంలో ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషిస్తారని తెలియ వస్తున్నది. గాంధీల త్రయంతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం ఇదే తొలి సారి కాదు.
ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తోనూ ప్రశాంత్ కిశోర్ సమావేశమైన సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో నూతన ఫ్రంట్ కట్ట నున్నారని వదంతులు వచ్చాయి. కానీ ప్రశాంత్ కిశోర్, పవార్లిద్దరూ కాంగ్రెస్ లేకుండా బీజేపీపై పోరుకు కూటమి ఉండదని తేల్చేశారు.