Warren hastings | ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో మహారాష్ర్టుల సహకారం తీసుకున్నారు. హైదర్తో యుద్ధం 1780లో ప్రారంభమైంది. తొలుత హైదర్ గెలిచినా, వారెన్ హేస్టింగ్స్ నక్కజిత్తులకు పాల్పడ్డాడు.
రాబర్ట్ క్లైవ్ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను వారెన్ హేస్టింగ్స్ (1772- 85) కొనసాగించాడు. తొలుత ఆయన మైసూరు పాలకుడు హైదర్ అలీతో పోరాటం చేశాడు. దీనికి హైదరాబాద్ నిజాం సహకారం తీసుకున్నాడు. ఆ తర్వాత మరాఠాల అంతర్గత రాజకీయాల్లో తలదూర్చడం ప్రారంభించాడు. బాలుడైన పీష్వా మాధవ రావు-2కు వ్యతిరేకంగా రఘునాథ రావును బలపరిచాడు. మాధవ రావుకు అండగా 18వ శతాబ్ది నాటి మరాఠా నాయకులలో ప్రముఖుడైన నానా ఫడణవీస్ ఉన్నాడు. అలా ఆంగ్లేయులు- మహారాష్ర్టులకు మధ్య 1775 నుంచి 1782 వరకు మొదటి యుద్ధం జరిగింది.
ఈ యుద్ధ సమయంలో మాత్రం వారెన్ హేస్టింగ్స్ మహారాష్ర్టులు, నిజాం, మైసూరు రాజ్యాల ఉమ్మడి దళాలతో పోరాడాల్సి వచ్చింది. అయితే ఈ ముగ్గురిని ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పడం ద్వారా వారెన్ హేస్టింగ్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఏది ఏమైనా మహారాష్ర్టులతో మొదటి యుద్ధంలో ఆంగ్లేయులకు అంతగా ఒరిగింది ఏమీ లేదు. చివరికి ఇద్దరి మధ్య యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దొరికిన సంధి కాలంలో ఆంగ్లేయులు తమ దృష్టినంతా మైసూరు పాలకుడు హైదర్ అలీ మీద కేంద్రీకరించారు. పైగా హైదర్తో పోరాటంలో మహారాష్ర్టుల సహకారం తీసుకున్నారు. హైదర్తో యుద్ధం 1780లో ప్రారంభమైంది. తొలుత హైదర్ గెలిచినప్పటికీ వారెన్ హేస్టింగ్స్ నక్కజిత్తులకు పాల్పడ్డాడు.
నిజాం నవాబుకు, మరాఠాలకు ఆక్రమించిన ప్రాంతాలను ఇస్తామని ఆశపెట్టాడు. హైదర్ అలీ 1781లో ఐర్ కూట్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత, పోరాటం కొనసాగుతుండగానే 1782లో మరణించాడు. తర్వాత 1789లో హైదర్ అనంతరం మైసూరు గద్దెనెక్కిన టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిమీద పోరాటం కొనసాగించాడు. 1792లో కారన్వాలిస్ చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. ఈ సంధి మేరకు సగం మైసూరు రాజ్యం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది.