(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులందరూ సమ్మెకు దిగారు. దీంతో భూపేష్ బఘేల్ సర్కారు ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. అయినా తాము వెనక్కు తగ్గేది లేదంటూ ఉద్యోగులంతా సమ్మెను మరింత ఉధృతం చేశారు. శుక్రవారం సీఎం ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 3న సమ్మె ప్రారంభమైనా, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 4 నుంచి ఆరోగ్య శాఖ ఉద్యోగులు విధుల్లో చేరారు. నేషనల్ హెల్త్ మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి 54 ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 45 వేల కాంటాక్ట్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించటాన్ని తుగ్లక్ చర్య అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాన్ని సాగిస్తామని ఒప్పంద ఉద్యోగుల ఫెడరేషన్ నాయకుడు హేమంత్ సిన్హా ప్రకటించారు. తమ సమ్మెకు పర్మినెంట్ ఉద్యోగుల మద్దతు కూడా ఉందని.. ప్రభుత్వ డాక్టర్ల సంఘం కూడా తమ పోరాటానికి మద్దతు తెలిపిందన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే ఒప్పంద ఉద్యోగులకు చాలా తక్కువగా వేతనాలు వస్తున్నాయన్నారు.