న్యూఢిల్లీ : ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. సహజ రీతిలో వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యం వల్ల దేశంలోని 80 శాతం చిన్న తరహా రైతులకు లాభం చేకూరుతుందన్నారు. సన్నకారు రైతులకు రెండు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంటుందని, వాళ్లు ఎక్కువ శాతం రసాయనాలపై ఖర్చు చేస్తుంటారన్నారు. సహజసిద్దమైన ఫెర్టిలైజర్లు వాడడం వల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాన్నారు. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల భూసారాన్ని కోల్పోతామని నిపుణులు చెబుతున్నారని, కానీ పంట వ్యర్ధాలను కాల్చడం ఓ సాంప్రదాయం అయిపోయిందని ప్రధాని వెల్లడించారు. కెమిస్ట్రీ ల్యాబ్ల నుంచి సేద్యాన్ని దూరం చేయాలని, సాగును సహజ ల్యాబరేటరీకి తరలించాలన్నారు. సహజమైన ల్యాబ్ అంటే సైన్స్ ఆధారితమైందని, విత్తనాల నుంచి నేల వరకు.. అన్నింటికీ సహజ రీతిలో పరిష్కారాలు దొరుకుతాయని మోదీ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, నేచురల్ ఫార్మింగ్ లాంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మార్చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.