కోల్కతా: కరోనా కేసుల సంఖ్య గత నాలుగైదు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్నది. వారం క్రితం దేశంలో రోజువారీ కేసులు కేవలం ఆరు వేలు నమోదుకాగా.. ఇవాళ ఆ సంఖ్య 27 వేలు దాటింది. దాంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
రేపటి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీపార్లర్లు, జంతుప్రదర్శన శాలలు, వినోద పార్కులను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రెటరీ హెచ్కే ద్వివేది ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను 50 శాతం స్టాఫ్ కెపాసిటీతో నిర్వహించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలనాపరమైన అన్ని సమావేశాలు వర్చువల్ విధానంలో జరుగుతాయని చెప్పారు.