గౌహతి: కరోనా టీకాలు వేసుకోకపోతే బహిరంగ ప్రదేశాలకు రావొద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులకు మినహా మరెక్కడా ప్రవేశించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలు, స్థలాలను సందర్శించేటప్పుడు పూర్తిగా టీకాలు వేసిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని పేర్కొంది. అలాగే కాంట్రాక్ట్తోసహా ప్రభుత్వ ఉద్యోగులంతా పూర్తిగా టీకాలు వేసుకుని మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు కావాలని తెలిపింది. పూర్తిగా టీకాలు వేసుకోని ఉద్యోగులను కార్యాలయాల్లో విధులకు అనుమతించబోమని పేర్కొంది.
టీకాలు పూర్తిగా తీసుకోని ఉద్యోగులు సెలవులు ఉంటే వినియోగించుకోవాలని లేదా అసాధారణ సెలవుపై ఉండాలని అస్సాం ప్రభుత్వం చెప్పింది. అలాంటి ఉద్యోగులకు జీతం చెల్లించబోమని స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఆంక్షలు విధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.