న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, అధిక ధరలపై ప్రధానంగా చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత రక్షణ మంత్రి, లోక్సభ ఉపనాయకుడు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలో అఖిపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు మురళీధరన్, అర్జున్ మేఘ్వాల్, లీడర్ ఆఫ్ ది హౌస్ పీయూష్ గోయల్ హాజరయ్యారు.
ఇక ప్రతిపక్షాల నుంచి అధిర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్), సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓ బ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ, టీఆర్ బాలు (డీఎంకే), పశుపతి పరాస్ (ఎల్జేపీ), వందనా చవాన్ (ఎన్సీపీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), బినోయ్ విశ్వం (సీపీఐ) తదితరులు సమావేశానికి వచ్చారు. కాంగ్రెస్, టీఎంసీలు నిరుద్యోగం అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాయి. అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కూడా చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని బిజూ జనతాదళ్ కోరింది.