హైదరాబాద్, మే 4 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిచింద’నేది సామెత. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి కూడా అలాగే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్తం పార్టీతో చెయ్యి కలిపిన ఏ పార్టీ అయినా అంతిమంగా చెడినట్టేనని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా ఉన్నాయి. అయితే, తాజాగా వెలువడిన బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది.
తద్వారా గడిచిన 15 ఏండ్లుగా బెంగాల్లో అధికారాన్ని చెలాయించిన మమత.. ఇప్పుడు ఆ పీఠానికి దూరమైంది. ఇక, ఇండియా కూటమిలోని మరో మిత్రపక్షం డీఎంకే కూడా తమిళనాడు తాజా ఎన్నికల్లో ఎంత మాత్రం ప్రభావం చూయించలేకపోయింది. గడిచిన ఎన్నికల్లో 133 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ, ప్రస్తుతం 57 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో సీఎం పీఠాన్ని మాత్రమే కాకుండా తన సిట్టింగ్ స్థానంలోనూ స్టాలిన్ ఓడిపోయారు.
కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టిన టీఎంసీ, డీఎంకేతో పాటు ప్రాంతీయంగా గట్టి పట్టు ఉన్న పలు పార్టీలు కూడా ఆ తర్వాతి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ జాబితాలో అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, తేజస్వీ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ, కేజ్రీవాల్ కన్వీనర్గా ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ, శివసేన (ఠాక్రే), ఎన్సీపీ (శరద్పవార్), జేడీఎస్ తదితర పార్టీలు కాంగ్రెస్తో జట్టుకట్టి ఆ తర్వాతి ఎన్నికల్లో నష్టపోయినట్టు చెప్తున్నారు.

హైదరాబాద్, మే 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. మూడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో హస్తంపార్టీ ఎంతమాత్రం ప్రభావం చూయించలేకపోయింది. మొ త్తంగా 534 స్థానాల్లో పోటీ చేస్తే, కేవలం 91 సీట్లను మాత్రమే గెలుచుకొంది. అలా కాంగ్రెస్ సక్సెస్ రేట్ 17 శాతానికే పరిమితమయ్యింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్.. ఇలాంటి ఫలితాలు సాధించడంపై రాజకీయవర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ జరిగిన వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సార్లు ఓటమిపాలయ్యిందని బీజేపీ ఎద్దేవా చేసింది. రాహుల్గాంధీ సెంచరీ కొట్టడానికి దగ్గరగా ఉన్నారని పేర్కొంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది.
