న్యూఢిల్లీ: దవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, కరోనా వైరస్ తదితర అంశాలు అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ( Mallikharjuna Kharge ) చెప్పారు. ఆల్పార్టీ మీటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధానంగా కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ కేంద్రప్రభుత్వం చట్టం చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని తెలిపారు.
కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేశామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాని హాజరవుతారని తాము భావించామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన హాజరుకాలేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రకటించిందని, అయితే ఆ సందర్భంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఖర్గే చెప్పారు. తనను రైతులు అర్థం చేసుకోలేదని ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో మరో రూపంలో తీసుకురానుందనేదే ప్రధాని మాటలకు అర్థమని వ్యాఖ్యానించారు.