Hemant Soren-JMM | హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హేమంత్ సోరెన్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజధాని రాంచీని వీడొద్దని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాల నేపథ్యంలో తలెత్తిన రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం సీఎం అధికార నివాసంలో తొలుత సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం రాంచీలో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
సీఎం హేమంత్ సోరెన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి పొద్దు పోయే వరకూ సీఎం నివాసం వద్దే వేచి ఉన్నారు. రాంచీకి సీఎం ఎప్పుడు వస్తారన్న విషయమై జేఎంఎం వర్గాలు నోరు మెదపడం లేదు. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.