న్యూఢిల్లీ: ఉక్రెయిన్ను తాత్కాలికంగా వీడాలని భారత పౌరులు, విద్యార్థులకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో ఉండటం అవసరం లేని విద్యార్థులు, భారత పౌరులు ఆ దేశాన్ని తాత్కాలికంగా వీడిపోవాలని అందులో పేర్కొంది. చార్టర్ విమానాల గురించి అప్డేట్ సమాచారం కోసం భారత విద్యార్థులు సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది. అలాగే ఏదైనా సమాచారం, సహాయం కోసం భారత రాయబార కార్యాలయం ఫేస్బుక్, వెబ్సైట్, ట్విటర్లను అనుసరించాలని సూచించింది.
కాగా, ఉక్రెయిన్లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు ఆ దేశాన్ని తాత్కాలికంగా వీడే అవకాశాలను పరిశీలించాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం ఈ నెల 15న పేర్కొంది. అయితే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు వెంటనే చేపట్టాల్సిన ప్రణాళికలు ఏమీ లేవని విదేశాంగ శాఖ గురువారం తెలిపింది.
మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారత్ వచ్చేందుకు విమానాలు లేక టికెట్లు లభించక భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నెల 22, 24, 26 తేదీల్లో ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నది. అలాగే అవసరమైన సమాచారం, సహాయం కోసం ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటల హెల్ప్లైన్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ADVISORY FOR INDIAN NATIONALS IN UKRAINE.@MEAIndia @DrSJaishankar @PIBHindi @DDNewslive @DDNewsHindi @IndianDiplomacy @PTI_News @IndiainUkraine pic.twitter.com/i3mZxNa0BZ
— India in Ukraine (@IndiainUkraine) February 20, 2022