న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు ఉపశమనం లభించింది. దేశ వ్యాప్తంగా ఆమెపై నమోదైన 10 కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులన్నింటినీ ఢిల్లీ పోలీసులే విచారిస్తారని తెలిపింది. ఇకపై నుపుర్ శర్మపై ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదైన ఆ కేసులన్నీ ఢిల్లీ కోర్టుకే బదిలీ అవుతాయని, ఢిల్లీ పోలీసులే పర్యవేక్షిస్తారని కోర్టు స్పష్టం చేసింది. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెపై తీవ్ర విమర్శలు రావడంతో పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.
నుపుర్ శర్మకు మధ్యంతర బెయిల్ కొనసాగుతూనే ఉంటుందని కోర్టు చెప్పింది. జులై 19న శర్మకు మధ్యంతర బెయిల్ లభించిన విషయం విదితమే. అయితే అన్ని రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే చోటకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును నుపుర్ శర్మ కోరారు. ఈ అప్పీల్పై కోర్టు విచారణ చేపట్టి.. శర్మపై నమోదైన కేసులను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే నుపుర్ శర్మ అప్పీల్ను బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.