రాంచీ: జార్ఖండ్లోని ఛాత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్(Air Ambulance) ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలో ఉన్న ఏడుగురు మృతిచెందారని, ఆ విమానం రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు ఛాత్రా డిప్యూటీ కమీషనర్ కీర్తిశ్రీ తెలిపారు. సిమరియా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుల భౌతికకాయాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బీచ్క్రాఫ్ట్ సీ90 ఎయిర్ అంబులెన్స్ను రెడ్బర్డ్ ఎయిర్వేస్ సంస్థ ఆపరేట్ చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఎయిర్ అంబులెన్స్ కూలిందని, ఇద్దరు పైలెట్లతో సహా ఏడు మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఛాత్రాలోని సదర్ ఆస్పత్రిలో పోస్టు మార్టమ్ చేస్తున్నారు. ప్రమాద ఘటన పట్ల దర్యాప్తు మొదలుపెట్టారు.
రాంచీ విమానాశ్రయం నుంచి 7.11 నిమిషాలకు విమానం టేకాఫ్ తీసుకున్నది. 7.30 నిమిషాలకు ఏటీసీతో కాంటాక్ట్ తెగిపోయింది. అయితే బహుశా మేఘావృతమైన వాతావరణం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కానీ ఇంత వరకు అధికారికంగా ఎటువంటి కారణం చెప్పలేదు. మృతుల్లో కెప్టెన్ వివేక్ వికాశ్ భగత్, కెప్టెన్ స్వరాజ్దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాశ్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, దురుకుమార్ ఉన్నారు. వారణాసికి ఆగ్నేయంగా 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కోల్కతాలోని ఏటీసీతో ఆ ఎయిర్ అంబులెన్స్ కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ప్రమాద స్థలానికి చేరుకున్నది.