న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ప్రభుత్వరంగ చమురు సంస్థ అయిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC ) కు తాత్కాలిక ఛైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా (సీఎండీగా) అల్కా మిట్టల్ నియమితులయ్యారు. దాంతో దేశంలోని అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థకు అధిపతి అయిన తొలి మహిళగా అల్కా గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటిదాకా తాత్కాలిక సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన సుభాష్ కుమార్ గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అల్కా మిట్టల్ను నియమించారు.
అల్కా మిట్టల్ను ONGC తాత్కాలిక సీఎండీగా నియమించాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ (ఏసీసీ- అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్) ఆమోదం తెలిపింది. అరు నెలలపాటు అల్కా మిట్టల్ ఈ పదవిలో కొనసాగనున్నారు. 2022, జనవరి 1 నుంచి ఆమె పదవీకాలం మొదలైంది. అల్కా మిట్టల్ చమురు, సహజవాయు పరిశోధన, ఉత్పత్తి కంపెనీకి మొదటి మహిళా అధిపతిగా నిలువగా, 2014లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెడ్గా బాధ్యతలు చేపట్టిన నిషీ వాసుదేవ ఓ ఆయిల్ కంపెనీకి అధిపతి అయిన మొదటి మహిళగా నిలిచారు.