లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)ని కరోనా వైరస్ వణికిస్తోంది. కొవిడ్-19 లక్షణాలతో ఏఎంయూ క్యాంపస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల్లో 34 మంది మరణించడం కలకలం రేపింది. కరోనా లక్షణాలతో గత 18 రోజుల్లో 34 మంది సర్వీసులో ఉన్న ఫ్యాకల్టీ సభ్యులతో పాటు రిటైరైన సభ్యులు మరణించారని వైస్ ఛాన్సలర్ తారిఖ్ మన్సూర్ పేర్కొన్నారు. క్యాంపస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్ధిష్ట కొవిడ్-19 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నదా అనేది గుర్తించాలని కోరుతూ వీసీ ఐసీఎంఆర్ కు లేఖ రేశారు.
ఏఎంయూతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరణాలకు నిర్ధిష్ట కొవిడ్-19 వేరియంట్ కారణమని ఈ లేఖలో వీసీ ప్రస్తావించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సరైన అథ్యయనం అవసరమని స్పష్టం చేశారు. మరోవైపు కొద్ది రోజుల కిందట మన్సూర్ సోదరుడు మరణించారని, శనివారం లా ఫ్యాకల్టీ డీన్ కొవిడ్ లక్షణాలతో కన్నుమూశారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక స్ధానిక జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ లోని మెక్రోబయాలజీ విభాగం జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టేందుకు శాంపిల్స్ ను ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ ఇంటిగ్రేటివ్ బయాలజీ లేబొరేటరీకి పంపింది.