AAP Tiranga Shakhas | బీజేపీ `విద్వేష పూరిత రాజకీయాలకు` ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) పోటీగా `తిరంగ శాఖ`లు ఏర్పాటు చేయబోతున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాదిరిగానే ఉత్తరప్రదేశ్లో ఈ తిరంగ శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు ఆప్ ఎంపీ, యూపీ ఇన్చార్జి సంజయ్ సింగ్ శనివారం చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో పది వేల తిరంగ శాఖలను ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ అమలు చేస్తున్న `విభజించు-పాలించు` విధానంపై ఉత్తరప్రదేశ్ ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ తిరంగ శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలను అమలు చేస్తున్నదని సంజయ్ సింగ్ చెప్పారు. ఇది దేశాన్ని, రాజ్యాంగాన్ని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా భారత్ తన గుర్తింపును కోల్పోతుందని సంజయ్ సింగ్ మీడియాతో అన్నారు. బీజేపీ విభజన రాజకీయాలపై యూపీ, దేశ ప్రజలను చైతన్య పర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ శాఖల తరహాలోనే ఆప్ తిరంగ శాఖలను ఏర్పాటు చేస్తుందని సంజయ్ సింగ్ వివరించారు. జూలై ఒకటో తేదీ నుంచి పది వేల శాఖలకు ప్రముఖ్లను నియమిస్తుందన్నారు. తిరంగ శాఖలను ఏర్పాటు చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తామని, రాజ్యాంగ పీఠికను చదివి వినిపిస్తామని అన్నారు.