UP Akhilesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2012లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అఖిలేశ్.. తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అటుపై 2017 అసెంబ్లీ, 2019 లోక్సభ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తులు ఫలించలేదు. తద్వారా ముచ్చటగా మూడుసార్లు పొత్తులతో విజయం సాధించలేకపోయారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనూ, 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతోనూ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానిక రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచినా విజయ తీరాలకు చేరలేకపోయారు. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో, 2019 తర్వాత బీఎస్పీతో పొత్తుకు గుడ్బై చెప్పారు అఖిలేశ్ యాదవ్.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టు కలిగి ఉన్న ఐదు చిన్న పార్టీలతో అఖిలేశ్ యాదవ్ జత కట్టారు. ఓం ప్రకాశ్ రాజ్భర్ సారధ్యంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), జయంత్ చౌదరి ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ), బాబాయి శివ్పాల్ యాదవ్ సారధ్యంలోని ప్రగతి శీల్ సమాజ్వాదీ పార్టీ (పీఎస్పీ), అప్నాదల్ (కమేరావాదీ), మహన్దళ్లతో పొత్తు పెట్టుకున్నారు. 403 స్థానాల్లో ఎస్పీ 345, ఆర్ఎల్డీ 33, ఎస్బీఎస్పీ 19, అప్పాదళ్ (కే) ఆరు సీట్లలో పోటీ చేశాయి.
2017 ఎన్నికల్లో ఎస్బీఎస్పీ, బీజేపీతో జత కట్టి 8 సీట్లలో పోటీ చేసింది. 0.7 శాతం ఓట్లతో నాలుగు స్థానాలు గెలుచుకుంది. తర్వాత బీజేపీతో పొత్తుకు గుడ్బై చెప్పి, అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎంతో చేతులు కలిపారు రాజ్భర్. కానీ తర్వాత ఎంఐఎంకు రాంరాం చెప్పి ఎస్పీతో జత కట్టారు. పశ్చిమ యూపీలో ప్రాతినిధ్యం గల జాట్లలో పట్టు ఉన్న పార్టీ ఆర్ఎల్డీ. 2014 ఎన్నికల్లో ఒక్క లోక్సభ సీటు కూడా గెలుచుకోలేదు. 2017 ఎన్నికల్లో 277 స్థానాల్లో పోటీ చేసి ఒకసీటులో విజయం సాధించారు. 1.78 శాతం ఓట్లు పొందినా 266 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎస్పీ విజయం సాధించింది. అటుపై ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్.. తనయుడు అఖిలేశ్ యాదవ్కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టినా బీజేపీ జైత్రయాత్రను అఖిలేశ్ యాదవ్ నిలువరించలేకపోయారు. 47 ఎస్పీ, ఏడు కాంగ్రెస్ గెలుచుకున్నది. బీజేపీ 325 స్ధానాలతో విజయం సాధించి అధికారం చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. బువా-బుతిజా జోడీ పేరిట లోక్సభ బరిలో దిగిన అఖిలేశ్-మాయావతి జోడీ మెరుగైన ఫలితాలు సాధించారు. విడిగా చూస్తే బీఎస్పీ 10 సీట్లలో గెలుపొందితే, ఎస్పీ ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.