లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబం ఉన్న వ్యక్తే కుటుంబ సభ్యులందరి బాధనూ అర్ధం చేసుకోగలడని పరోక్షంగా యోగిని దుయ్యబట్టారు. కుటుంబం లేని వ్యక్తులు ప్రజల బాధను అనుభవించలేరని, అర్ధం చేసుకోలేరని అఖిలేష్ అన్నారు.
వారసత్వ రాజకీయాలంటూ తనపై యోగి చేసిన విమర్శలను అఖిలేష్ తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లలిత్పూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అఖిలేష్ యోగి ఆదిత్యానాధ్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ గతంలోనూ యోగిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహోబాలో సమాజ్వాదీ విజయ్ యాత్ర సందర్భంగా మాట్లాడుతూ పరోక్షంగా యోగిని ఉద్దేశించి హుక్కా పీల్చే వారికి జనం బాధలు పట్టవని, నిజంగా వారికి ప్రజల కష్టాలు తెలిస్తే గత నాలుగున్నరేండ్లలో ప్రజలకు ఎంతోకొంత మేలు చేసి ఉండేవారని అన్నారు. అఖిలేష్ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని సాధువులు మండిపడ్డారు. అఖిలేష్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.