లక్నో : వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ కూటమికి 400 స్ధానాలు దక్కుతాయని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని కాషాయ పార్టీకి ఓటమి ఎదురవనుందని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను చెత్తబుట్టలో పడేసిన బీజేపీ పట్ల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారని ఓ జాతీయ వార్తా చానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిలేష్ పేర్కొన్నారు.సమాజంలో అన్ని వర్గాలను గౌరవించే పార్టీకే ఈసారి ప్రజలు అధికారం కట్టబెడతారని అన్నారు.
యూపీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో తాము జట్టుకట్టబోమని, చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ పునరుద్ఘాటించారు. యూపీలో ఎస్పీ సర్కార్ కొలువుతీరడంలో మహిళలు, యువత కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ గొప్పలు చెప్పిందని, అది ఆచరణలో సాధ్యం కాలేదని అఖిలేష్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ధరలు మాత్రం చుక్కలు తాకాయని అన్నారు.