లక్నో : కరోనా మరణాలను యూపీ ప్రభుత్వం వెల్లడించకుండా దాస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కరోనా మరణాలను కప్పిపుచ్చడం ద్వారా వాస్తవానికి కాషాయ ప్రభుత్వం తన ముఖాన్ని దాచుకుంటోందని మండిపడ్డారు. గత ఏడాది జులై 1 నుంచి మార్చి 2021 వరకూ యూపీలోని 24 జిల్లాల్లో అధికారికంగా వెల్లడించిన గణాంకాల కంటే కరోనా మరణాలు 43 రెట్లు అధికంగా ఉన్నాయని, అధికారిక గణాంకాలకు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)లో నమోదైన మరణాలకు పొంతన లేదనే వార్తల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఈ సమాచారం వెలుగుచూసిందని అఖిలేష్ యాదవ్ మంగళవారం ట్వీట్ చేశారు. యూపీ బీజేపీ ప్రభుత్వం వాస్తవానికి కరోనా మరణాల సంఖ్యను కాకుండా తన ముఖాన్ని దాచుకుంటోందని అఖిలేష్ యోగి ఆదిత్యానాధ్ సారథ్యంలోని బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు.