లక్నో : రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 400 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కాన్పూర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎస్పీకి 400 స్ధానాలు కట్టబెడతారని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
కాషాయ పార్టీ సర్కార్ను కూలదోయడమే తమ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని లఖింపూర్ ఖేరి ఘటనను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలోనే అధికార మార్పిడి జరగడం ఖాయమని అన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ వాహనాలతో రైతులను తొక్కించి చంపేస్తున్నారని ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎరువుల ధరలను పెంచి రైతులను పీడిస్తున్న నకిలీ బాబా పతనం తప్పదని యోగిని ఉద్దేశించి అఖిలేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీలో నిరుద్యోగం, ధరల మంట, శాంతిభద్రతలు క్షీణించడం యోగి సర్కార్ వైఫల్యాలేనని మండిపడ్డారు.