లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన 49వ జన్మదినం సందర్భంగా శుక్రవారం విద్యార్ధులకు ల్యాప్టాప్లు అందచేశారు. యూపీ బోర్డు పదో తరగతి, పన్నెండో తరగతిలో టాప్ అయిదు స్ధానాల్లో నిలిచిన విద్యార్ధులకు ఈ కానుక అందించారు. మొత్తం 30 మంది విద్యార్ధులు అఖిలేష్ యాదవ్ నుంచి ల్యాప్టాప్లు స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నెరవేర్చడం లేదని, తాము అధికారంలో లేకున్నా పాలకులకు వారి హామీలను గుర్తు చేసేందుకు ల్యాప్టాప్లు పంపిణీ చేశామని అఖిలేష్ పేర్కొన్నారు. అఖిలేష్ బర్త్డే సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రార్ధనా స్ధలాల్లో పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ విపక్ష నేత అఖిలేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.