UP Polls| ఎట్టకేలకు సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేసే స్థానం ఫిక్స్ చేసింది పార్టీ. మెయిన్పురిలోని కర్హల్ స్థానం నుంచి అఖిలేశ్ బరిలోకి దిగుతున్నారని పార్టీ గురువారం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 20 న ఈ స్థానంలో పోలింగ్ జరుగుతుంది. మొదట ఆజంగఢ్ నుంచి అఖిలేశ్ బరిలోకి దిగుతున్నారని బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సంభల్ గున్నౌర్ నుంచి బరిలోకి దిగుతున్నారన్న ప్రచారమూ జరిగింది. వీటన్నింటినీ కాదని, కర్హల్ నుంచి బరిలోకి దిగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మార్గదర్శకుడి స్థానంలో వున్న మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ములాయం ఇక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. అలాగే కొంత కాలం ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు ములాయం.
ముందు నుంచి కూడా కర్హల్ నియోజకవర్గంలో యాదవులకు ఓటు బ్యాంకు అధికంగానే ఉంది. యాదవులే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సమాజ్వాదీకి కూడా మంచి పట్టుంది. 1993,96 లో సమాజ్వాదీ నుంచి బాబూరామ్ యాదవ్ గెలుపొందారు. ఆ తర్వాత 2000 లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ నుంచి అనిల్ యాదవ్ గెలుపొందారు. ఆ తర్వాత 2002 లో మాత్రం ఇక్కడ బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత 2007,2012, 2017 ఎన్నికల్లో మాత్రం సమాజ్వాదీయే గెలుపొందింది.