లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మైన్పురిలోని కర్హల్ స్థానం నుంచే అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారని సమాజ్ వాదీ పార్టీ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఎస్పీ నేత రాంపాల్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. అఖిలేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. కర్హల్ సమాజ్వాదీ పార్టీ కంచుకోటగా ఉన్నది. పార్టీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం మైన్పురి పార్లమెంటరీ నియోజకర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్హల్లో 1.44లక్షల మంది యాదవ ఓటర్లు ఉండడంతో అఖిలేష్ యాదవ్ ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న అఖిలేష్ రైతులకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు హామీ ఇచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో 22లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.