లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఈనెల 3న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సారధ్యంలో మెగా ర్యాలీ జరగనుంది. విపక్షాల భారీ ర్యాలీలో అఖిలేష్ యాదవ్తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరి వేదికను పంచుకోనున్నారు. ఫిబ్రవరి 8న మమతా బెనర్జీ లక్నో పర్యటన సందర్భంగా కాశీలో జరిగే ర్యాలీలో అఖిలేష్తో కలిసి తాను ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.వారణాసిలో జరిగే మెగా ర్యాలీలో అఖిలేష్, మమతా బెనర్జీలతో పాటు ఎస్పీ మిత్రపక్షాలు ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్, అప్నాదళ్ (కే) నేత కృష్ణ పటేల్ కూడా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం వారణాసి చేరుకునే మమతా బెనర్జీ ఐర్హి గ్రామంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.
మార్చి ఏడున జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్లో కాశీలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు సహా 54 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 3న విజయ్ రధ్ రోడ్షో కూడా జరుగుతుందని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. మమతా బెనర్జీ కాశీ విశ్వనాధుడి దర్శనం చేసుకుని గంగా హారతిలో పాల్గొంటారని సమాచారం. ఇక వారణాసి ర్యాలీలో స్వామి ప్రసాద్ మౌర్య కూడా విపక్ష నేతలతో కలిసి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.