ముంబై: అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన కొంత మంది ఎన్సీపీ సహచరులను అవినీతి ఆరోపణల నుంచి ప్రధాని మోదీ తప్పించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తన వర్గంతో కలిసి రాజ్భవన్కు వెళ్లి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు.
కాగా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగిన ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందని, అయితే తనకు మాత్రం కాదని అన్నారు. 1980లో తన నాయకత్వంలోని నేతలంతా ఇదే మాదిరిగా వెళ్లిపోయినా, పార్టీని పునరుద్ధరించినట్లు గుర్తు చేశారు. అందువల్ల ఇవాళ జరిగిన దాని గురించి తాను ఆందోళన చెందడం లేదని చెప్పారు. గతంలో మాదిరిగా పార్టీని పునరుద్ధరిస్తానని అన్నారు.
మరోవైపు ఎన్సీపీపై హక్కు తమకే ఉందని ఎవరైనా క్లెయిమ్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని శరద్ పవార్ తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరుతామని చెప్పారు. ప్రజలు తమకు మద్దతిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు తనకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.