గువహటి : రాబోయే ఐదారేండ్లలో బీజేపీ కనుమరుగవుతుందని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భుయ బుధవారం పేర్కొన్నారు. కాషాయ పార్టీ పతనం బిహార్తో ప్రారంభమవుతుందని అన్నారు. బీజేపీని మరోసారి ప్రజలు ఆమోదించే పరిస్ధితి లేదని ఏఐయూడీఎఫ్ నేత స్పష్టం చేశారు. ఇక అసోంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి సెప్టెంబర్ 2న తమ పార్టీలో చేరతారని ఏఐయూడీఎఫ్ నేత కరీముద్దీన్ వెల్లడించారు.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ను మునిగే నావగా ఆయన అభివర్ణించారు. అసోం నుంచి బీజేపీని పారదోలతామని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దిన్ అజ్మల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడుతుండటంతో ఏఐయూడీఎఫ్ బలపడే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.