Air India : థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం ఇటీవల తీవ్ర కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ విమానం నడిపిన పైలట్ డ్రగ్స్ సేవించినట్లు తాజా విచారణలో తేలడంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఎయిరిండియా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని శుక్రవారం ప్రకటించింది.
పైలట్ చేసిన చర్యను సమర్ధించలేమని, తమ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, భద్రతా ప్రమాణాల రీత్యా అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు సంస్త వెల్లడించింది. ఏఏఐబీ (ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) విచారణ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 4న థాయ్లాండ్ (ఫుకెట్) నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీ బయల్దేరింది. ఇందులో మొత్తం 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం గాలిలో ఉండగా తీవ్ర కుదుపులకు గురైంది.
అలాగే, భూమికి 300 అడుగుల ఎత్తుకు పడిపోయింది. అనంతరం మళ్లీ విమానం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అయితే, ఈలోపే విమానంలో 17 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. ఒక సిబ్బందికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పైలట్ డ్రగ్స్ మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని కేంద్ర విమానయాన శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. మొదట పైలట్ గంజాయి సేవించి ఉన్నాడని ప్రచారం జరిగింది.
చివరకు ఈ అంశంపై ఏఏఐబీ (ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) విచారణ జరిపి నివేదిక అందించింది. ఈ నివేదికలో పైలట్ నిషేధిత డ్రగ్స్ సేవించినట్లు తేలింది. దీంతో ఆ పైలట్ను వెంటనే విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఎయిరిండియా సంస్థ ప్రకటించింది.