న్యూఢిల్లీ, మార్చి 20: సిబ్బంది కొరత కారణంగా అమెరికాకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా కుదిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమెరికా వెళ్లే వారపు విమానాల్లో న్యూయార్క్ రూట్లో మూడు, శాన్ఫ్రాన్సిస్కో రూట్లో మూడు విమానాలు తగ్గిస్తున్నట్టు ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ సోమవారం తెలిపారు. బోయింగ్ 777 విమానాల పైలట్లు వందమంది, 1400 మంది కేబిన్ క్రూ శిక్షణలో ఉన్నారని, వీరంతా రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి వస్తారని, అప్పటివరకు ప్రయాణికులకు అసౌకర్యం తప్పదని ఆయన చెప్పారు.
సిబ్బంది కొరత కారణంగా దూరప్రాంత విమాన సర్వీసులకు ఇటీవల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నందున దానిని అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎయిర్ ఇండియాకు ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బంది కలిసి 11 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన చెప్పారు. కాగా ఎయిర్ ఇండియా గత నెలలో కొత్త విమానాల కోసం పెద్దఎత్తున ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసింది. మొత్తం 470 కొత్త విమానాలకు ఈ సంస్థ ఆర్డర్ ఇవ్వగా, అందులో 250 ఎయిర్బస్, 220 బోయింగ్ విమానాలు ఉన్నాయి.