న్యూఢిల్లీ, మార్చి 20: కెనడాలోని వాంకోవర్కు బయల్దేరిన ఎయిరిండియా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్’ విమానం వెనక్కి మళ్లింది. ఏడు గంటలకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత గురువారం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ విమాన సర్వీసును నడపటంలో అధికారిక అనుమతి లేనందున ఫ్లైట్ వెనక్కి రప్పించాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
బోయింగ్ 777-300 ఈఆర్కు బదులుగా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్’ను పంపటమే ఇందుకు కారణమని, అనుమతిలేని విమానాన్ని వినియోగించారని, నిబంధనల్లో స్పష్టమైన లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సదరు విమానం న్యూఢిల్లీలో సురక్షితంగా దిగిందని ‘ఎయిరిండియా’ శుక్రవారం తెలిపింది. చైనా గగనతలంలో ప్రయాణిస్తుండగా విమానాన్ని వెనక్కి మరలించారని తెలిసింది.