IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నాగ్పూర్లోని భోంస్లా మిలిటరీ స్కూల్లో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండుమూడేళ్లలో భారత్లో అనేక సైన్యం అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోనే తయారైన పరికరాలు వైమానిక దళం నేతృత్వంలో ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు గుర్తించామని, ఆ తర్వాత అవి ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్లో చేర్చామని ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు.
వైమానిక దళం ఎల్లప్పుడూ మరమ్మతు, నిర్వహణ కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడుతుందని చెప్పారు. ఇకపై ఇది జరుగకూడదన్నారు. మారుతున్న పరిస్థితుల్లో మరమ్మతు, నిర్వహణ తదితర అనేక విషయాల్లో వైమానిక దళం స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాల్సి ఉంటుందని విశ్వసిస్తోందన్నారు. బేస్ రిపేర్ డిపో (BRD)పై ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు చాలా పారిశ్రామిక కంపెనీలు అన్ని BRDలలో పని చేయగలవన్నారు. పారిశ్రామిక ప్రపంచం వైమానిక దళానికి ఎక్కడ సహకారం అందించగలదో చూసేందుకు వారికి అవకాశం లభిస్తుందన్నారు. వైమానిక దళంలోని అన్ని యూనిట్లకు సహకారం అందించగల కంపెనీలకు తలుపులు తెరిచి ఉన్నాయన్నారు.
చెన్నై తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం శిథిలాల గురించిన ప్రశ్నపై ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు చాలా సమయం పట్టిందన్నారు. వైమానిక దళం కనీసం లోతైన సముద్ర అన్వేషణకు సాంకేతికతను కలిగి ఉందని.. శిథిలాలు దొరకడంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడిందన్నారు. 29 మంది సిబ్బందితో ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం అదృశ్యమైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత దాని శిథిలాలు వెలికితీశారు. భారత వైమానిక దళానికి చెందిన విమాన శకలాలు బంగాళాఖాతంలో దాదాపు 3.4 కిలోమీటర్ల లోతులో లభ్యమయ్యాయి.