AIIMS Delhi | సోమవారం అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ వేడుక కోసం హాఫ్ డే సెలవుపై ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖాన యాజమాన్యం వెనక్కు తగ్గింది. వైద్యుల అపాయింట్మెంట్లు తీసుకున్న రోగుల కోసం ఔట్ పేషంట్ విభాగం సోమవారం అంతా యథాతథంగా పని చేస్తుందని ఆదివారం జారీ చేసిన ఓ సర్క్యులర్’లో తెలిపింది. రోగులకు అసౌకర్యాన్ని నివారించేందుకు ఔట్ పేషంట్ విభాగం సేవలు అందించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతోపాటు ఆల్ క్రిటికల్ క్లినికల్ కేర్ సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయని వివరించింది.
ఇంతకుముందు రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం దవాఖానను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ మూసి ఉంచుతామని ఎయిమ్స్ శనివారం ప్రకటించింది. దీనిపై శివసేన ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం నేత ప్రియాంక చతుర్వేది సహా పలువురు విపక్ష నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎయిమ్స్ నిర్ణయాన్ని తప్పు బట్టారు. దీంతో ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే భువనేశ్వర్ ఎయిమ్స్ మాత్రం సోమవారం హాఫ్ డే సెలవు ప్రకటించింది.