చెన్నై: తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగడంతో ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం చర్యలు చేపట్టారు. (AIADMK sacks 29 Leaders) ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం సహా తిరుగుబాటు నాయకులను వారి పదవుల నుంచి తొలగించారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 29 మంది నేతలపై వేటు వేశారు.
కాగా, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు మాత్రమే ఎన్నికల్లో టీవీకే గెలుచుకున్నది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారికి మార్కు 118 సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో విజయ్ అసెంబ్లీలో తన మెజారిటీని సునాయాసంగా నిరూపించుకున్నారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు వర్గంపై అన్నాడీఎంకే చర్యలు చేపట్టింది. 29 మంది నేతలను పార్టీ పదవుల నుంచి తొలగించింది.