AIADMK | లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కూటమి, బీజేపీతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో కూటమి నుంచి వైదొలగాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీ నేత మునుస్వామి ప్రకటించారు. అయితే, కూటమి నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర నేత చేసిన వ్యాఖ్యలే కారణంగా తెలుస్తున్నది.
మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం పీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 1956లో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాదురై హిందూ మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు అన్నామలై పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అన్నాడీఎంకే డిమాండ్ చేయగా.. ఆయనకు ఇందుకు నిరాకరించారు. తాను అన్నాదురై గురించి తప్పుగా ఏం మాట్లాడలేదని, 1956లో జరిగిన సంఘటన గురించి మాత్రమే చెప్పానని పేర్కొన్నారు.
అయితే, అన్నాదురై చేసిన వ్యాఖ్యలను స్వాతంత్య్ర సమరయోధుడు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరుపార్టీల మధ్య సంబంధాలు దిగజారాయి. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే పార్టీ సోమవారం సమావేశమైంది. భేటీలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. బీజేపీ వైకరి కారణంగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ నేత మునుస్వామి పేర్కొన్నారు. అయితే, 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూటమి నుంచి వైదొలగడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.